Cricket: మీ దృష్టి పడకుండా ఉంటే పంత్ ఇంకా బాగా రాణిస్తాడు: మీడియాను ఉద్దేశించి రోహిత్ శర్మ

  • మైదానంలో ప్రతీ కదలికను తప్పు పట్టొద్దని హితవు
  • సహజశైలిలో ఆడేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచన
  • జట్టు వ్యూహాల అమలుకు ప్రయత్నిస్తున్నాడని వెల్లడి

బంగ్లాదేశ్ తో భారత్ ఆడిన రెండు టీ-20 మ్యాచుల్లో బ్యాట్స్ మన్, వికెట్ కీపర్ గా, రిషభ్ పంత్ అంతగా సక్సెస్ కాలేదని విమర్శలు వస్తోన్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ అతనికి మద్దతు పలికాడు. టీం మేనేజ్ మెంట్ నిర్ణయాలను అమలు చేసేందుకు అతను ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు.

పంత్ ను విమర్శిస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీయవద్దని మీడియాను కోరాడు. పంత్ వయసు 22 మాత్రమేనంటూ, అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, తన సహజ శైలిలో ఆటను ఆడనివ్వాలన్నారు. గతంలో అతడు అద్భుత ఆటను ప్రదర్శించిన సందర్భాలను మరవరాదన్నాడు.

‘పంత్ ను ఒంటరిగా వదిలేయండి. మైదానంలో అతడు తన వ్యూహాలను అమలు చేయనీయండి. అతడు భయం లేకుండా ఆడే క్రికెటర్, మేం అతడికి స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాము. మీరు అతనిపై నుంచి దృష్టి మరలిస్తే ఇంకా బాగా ఆడతాడు. అతని గురించి మాట్లాడటం మానండి’ అని రోహిత్ అన్నాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో చివరి మ్యాచ్ రేపు నాగపూర్ లో జరగనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్, బంగ్లా చెరొక మ్యాచ్ గెలుచుకున్నాయి.  

More Telugu News