Crime News: ప్రియుడితో వ్యవహారం...అడ్డుపడుతున్నాడని భర్త హత్య!

  • మత్తు మందిచ్చి అనంతరం వైరుతో గొంతు నులమడంతో మృతి
  • కట్టుకున్న వాడినే కడతేర్చిన మహిళ
  • వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తున్నాడని కక్ష

ప్రియుడి మోజులో పడిన ఆ మహిళ.. జీవితాంతం తోడుంటానని బాసలు చేసి మెడలో తాళికట్టిన భర్తను వదిలించుకోవాలని చూసింది. తమ చీకటి వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితోనే కలిసి అతన్ని హత్య చేసింది. భర్త మృతిని సాధారణ మరణంగా చిత్రించేందుకు ఆమె ఎంతగా నటించినా పోలీసుల విచారణలో వాస్తవం బయటపడింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతచెట్టు తండాలో చోటు చేసుకున్న ఈ ఘాతుకానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

తండాకు చెందిన నేనావత్‌ రమేష్‌ (25), స్వప్న దంపతులు. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌గా రమేష్‌ పని చేస్తున్నాడు. అక్కడే దంపతులు నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో పగలు వాచ్‌మెన్‌గా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బొంత నాగేంద్రబాబు అలియాస్‌ నాగరాజు పనిచేస్తున్నాడు. ఈ కారణంగా నాగరాజుకు, స్వప్నకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ విషయం తెలిసి రమేష్‌ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె తన తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో గతనెల దీపావళి పండుగ సందర్భంగా రమేష్‌, స్వప్నలు సొంతూరు చింతచెట్టు తండాకు వచ్చారు. ఇదే అదనుగా రమేష్ అడ్డు తొలగించుకోవాలని స్వప్న, నాగరాజు ప్రణాళిక వేశారు. ఆ మేరకు గతనెల 29న రమేష్‌ రాత్రి భోజనంలో స్వప్న మత్తుమందు కలిపింది. భర్త నిద్రలోకి జారుకోగానే ఫోన్‌లో నాగరాజుకు సమాచారం ఇచ్చింది.

స్వప్న ఇంటికి వచ్చిన నాగరాజు తన వెంట తెచ్చిన వైరుతో నిద్రలో ఉన్న రమేష్‌ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. తొలుత దీన్ని సాధారణ మరణంగానే అంతా అనుకున్నారు. అయితే స్వప్న అనుమానాస్పద ప్రవర్తనతో మృతుని సోదరుడు నరేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో స్వప్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం ఘాతుకం వెలుగుచూసింది. దీంతో స్వప్న, ఆమె ప్రియుడు నాగరాజును కొండమల్లేపల్లి పోలీసులు నిన్న అరెస్టు చేశారు.

More Telugu News