Nara Lokesh: శ్మశానాలకూ మీ పార్టీ రంగులు పూసుకునే కార్యక్రమం పూర్తయ్యింది కదా జగన్ గారూ!: లోకేశ్

  • ఇక ఆలస్యం ఎందుకు?
  • పోలీస్ స్టేషన్లకూ వైసీపీ రంగులు వెయ్యడం ప్రారంభించండి
  • టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెట్టిస్తున్నారు
  • అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు 

వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శల జల్లు కురిపించారు. అన్ని భవనాలకు పార్టీ రంగులు వేసుకుంటున్నారని వైసీపీపై టీడీపీ మండిపడుతోన్న విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్లకు కూడా వైసీపీ రంగులు వెయ్యడం ప్రారంభించాలంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. 'శ్మశానాలకు, మరుగుదొడ్లకు మీ పార్టీ రంగులు పూసుకునే కార్యక్రమం పూర్తయ్యింది కదా జగన్ గారు. ఇక ఆలస్యం ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా వైకాపా రంగులు వెయ్యడం ప్రారంభించండి' అంటూ ట్వీట్ చేశారు.
 
'శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులతో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెట్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై ఏకంగా పోలీసులతోనే దాడులు చేయిస్తున్నారు. తిరుచానూరులో టీడీపీ కార్యకర్త హేమంత్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని నారా లోకేశ్ మరో ట్వీట్ చేశారు.
 
'ముఖ్యమంత్రి జగన్ తన ఫ్యాక్షన్ కోరికలను పోలీసుల ద్వారా తీర్చుకుందామనే సరికొత్త పంథా ఎంచుకున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదు. అక్రమ కేసులు పెడుతున్న అధికారులపై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించే న్యాయ పోరాటం ప్రారంభించబోతున్నాం' అని నారా లోకేశ్ హెచ్చరించారు.

More Telugu News