Narendra Modi: అయోధ్యపై ఏ ఒక్కరూ మాట్లాడొద్దు: కేంద్ర మంత్రులకు మోదీ వార్నింగ్

  • సామరస్యం దెబ్బతినేలా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దు
  • కేంద్ర మంత్రులు సంయమనంతో వ్యవహరించాలి
  • సుప్రీం తీర్పును ఏ ఒక్కరూ గెలుపుగానో, ఓటమిగానో భావించవద్దు

అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న తరుణంలో తన సహచర కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దేశంలో సామరస్యపూర్వక వాతావరణం దెబ్బతినేలా ఈ అంశానికి సంబంధించి ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని హెచ్చరించారు. కేంద్ర మంత్రులంతా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అక్టోబర్ 27న జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, అయోధ్య కేసులో తీర్పును ఎవరూ కూడా ఒక ఓటమిగానో, గెలుపుగానో భావించరాదని అన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆరోజు లోగానే అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. కోర్టు తీర్పుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కు భారీ సంఖ్యలో అదనపు భద్రతాబలగాలను తరలిస్తున్నారు. ఎలాాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాల తరలింపు జరుగుతోంది.

More Telugu News