TSRTC: గడువు ముగిసినా... టీఎస్ ఆర్టీసీ విధుల్లో చేరింది 360 మందే!

  • 33వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
  • విధుల్లో చేరిన 200 మంది బస్ భవన్ సిబ్బంది
  • కొనసాగుతున్న కార్మికుల నిరసనలు

మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరకుంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలను పోగొట్టుకున్నట్టేనని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టినా, కార్మికులు మాత్రం బెట్టు వీడలేదు. అర్థరాత్రి దాటే సమయానికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో కేవలం 360 మంది మాత్రమే విధుల్లోకి చేరుతామని చెబుతూ లేఖలు అందించారు. వీరిలో డ్రైవర్లు, కండక్టర్ల బదులు హైదరాబాద్ బస్ భవన్ లోని పరిపాలనా సిబ్బందే అత్యధికులు ఉండటం గమనార్హం. ఈ సిబ్బందిలోనే 200 మంది వరకూ విధుల్లో చేరారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 62 మంది, హైదరాబాద్ జోన్ లో 31 మంది, ఇతర డిపోల్లో మిగతావారు విధుల్లోకి చేరేందుకు ముందుకు వచ్చారు. ఇక ఆర్టీసీ సమ్మె నెల రోజులకు పైగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో బస్సులు తిరగకపోవడంతో తమ గమ్యస్థానానికి చేరలేకపోతున్నారు. సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులు వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, మానవహారాలు చేపట్టారు. నేటితో సమ్మె 33వ రోజుకు చేరగా, కార్మికులు సైతం సమ్మెను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

More Telugu News