TTD: టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుగా రమణదీక్షితులు నియామకం

  • రమణదీక్షితులకు టీటీడీ పదవి
  • ఆయన ఇద్దరు కుమారులకు శ్రీవారి ఆలయానికి బదిలీ
  • ఏడాదిన్నర విరామం తర్వాత శ్రీవారి ఆలయానికి రమణదీక్షితులు

తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత మళ్లీ ఓ పదవి చేపట్టనున్నారు. రమణదీక్షితులను ఏపీ సర్కారు టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుగా నియమించింది. అంతేకాకుండా, రమణదీక్షితులు ఇద్దరు కుమారులు వెంకటకుమార దీక్షితులు, రాజేశ్ దీక్షితులను గోవిందరాజస్వామి ఆలయం నుంచి మళ్లీ శ్రీవారి ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రమణదీక్షితులుతో పాటు రిటైరైన నలుగురు ప్రధాన అర్చకులకు కూడా శ్రీవారి ఆలయంలో పునఃప్రవేశం కల్పిస్తున్నట్టు సమాచారం.

రమణదీక్షితులుపై గత ప్రభుత్వం దాఖలు చేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకోవడంతో రీఎంట్రీకి మార్గం సుగమం అయింది. వైఖానస ఆగమశాస్త్రంలో ఆయన అనుభవం, పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. స్వామివారి కైంకర్యాలలో కొత్త అర్చకులకు ఆయన సూచనలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. గత నెల 23న జరిగిన టీటీడీ సమావేశంలోనే రమణదీక్షితులు పునరాగమనంపై తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. తాజా నియామకం నేపథ్యంలో రమణదీక్షితులు టీటీడీ జేఈవో ధర్మారెడ్డిని కలిశారు.

More Telugu News