SRSP canal: ఎస్సారెస్పీ కాలువలో దిగి గల్లంతైన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ

  • స్నేహితులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు గిరీశ్
  • స్నేహితులు వద్దని వారిస్తున్నా నీటిలోకి
  • ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయిన వైనం

స్నేహితులతో కలిసి సరదాగా ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే పీఏ ఒకరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వద్ద గిరీశ్ పీఏగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన మరో ముగ్గురు స్నేహితులు విజయ్, బాలన్, రామకృష్ణలతో కలిసి అంతర్గాం శివారులో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌ను చూసేందుకు వెళ్లారు.  

ఈ క్రమంలో స్నేహితులు వద్దని వారిస్తున్నా సరదాగా ఈత కొట్టేందుకు ప్రాజెక్టు కాకతీయ కాల్వలో దిగిన గిరీశ్ ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు, పోలీసులు కూడా గజ ఈతగాళ్లతో కలిసి అంతర్గాం, థరూర్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

More Telugu News