Pawan Kalyan: నాలా పార్టీ పెట్టి మాట్లాడే దమ్ము, ధైర్యం ఎవరికుందో చెప్పండి?: పవన్ కల్యాణ్ ఆవేశం

  • వైజాగ్ లో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్
  • బహిరంగ సభకు హాజరైన జనసేనాని
  • ఉద్వేగభరితంగా ప్రసంగం

విశాఖలో లాంగ్ మార్చ్ ర్యాలీ ముగిసిన అనంతరం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. విశాఖ లాంగ్ మార్చ్ కు పెద్దలు, యువకులు, స్త్రీలు, కార్మికులు, కార్యకర్తలు, సామాన్యులు అందరూ వచ్చారని, వాళ్లేమీ సరదా కోసం రాలేదని అన్నారు.

"వాళ్లు సరదా కోసం వచ్చారనుకున్నారా? నేను పబ్లిక్ లోకి వస్తే ఊపిరి తిప్పుకోలేనంతగా జనాలు చుట్టుముడతారు. అయినా వచ్చాను. ఇదేమన్నా నాకు సరదా అనుకున్నారా? ఓ ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలల్లోనే ప్రజలు ఇలా రోడ్లపైకి వచ్చారంటే ఆ ప్రభుత్వం విఫలమైనట్టే లెక్క. నన్ను విమర్శించే నాయకుల్లా నాకు వేల కోట్లు లేవు. వేల ఎకరాలు లేవు. ఎవడికి దమ్ముందో, ఎవడికి ధైర్యం ఉందో వాళ్లను ఓ పార్టీ పెట్టి మాట్లాడమనండి ఒక్కొక్కడ్ని. పార్టీ నడపాలంటే ఆషామాషీ అనుకున్నారా? ఓ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, ఓ భావనతో, ఓ భావజాలంతో చచ్చిపోయేవరకు నిలబడగలవా అనే అంశమే ఓ పార్టీ నడపడంలో కీలకమని భావిస్తాను.

వైసీపీ నాయకులను అడుగుతున్నాను, 2014లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణ నడిబొడ్డున కూర్చుని నిలదీసే దమ్ము, ధైర్యం మీకెక్కడుంది? ఆ రోజున నువ్వు మాట్లాడావా? ఆ రోజున జనసేన తన వైఖరి వినిపించింది కాబట్టే తెలంగాణ ప్రజలు మన్ననలు పొందగలిగింది. ఇవాళ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నా వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకున్నారు. వాళ్లకు కూడా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం" అంటూ పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

More Telugu News