Crime News: భార్య ఉండగా మరో మహిళతో పెళ్లి.. విషయం బయటపడుతుందని హత్య

  • మేడపై నుంచి తోసేసి ప్రమాదంగా చిత్రీకరణ
  • తీవ్రంగా గాయపడిన బాధితురాలు విషయం వెల్లడి
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

అప్పటికే పెళ్లయి ఓ కూతురు ఉన్నా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తీరా తొలి వివాహం బయటపడుతుందని తెలియగానే నిర్దాక్షిణ్యంగా రెండో భార్యను చంపేశాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం బెడిసికొట్టడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు.

పోలీసుల కథనం మేరకు...మహారాష్ట్ర గోండియా జిల్లాకు చెందిన తిలక్‌చంద్‌ సుందర్‌లాల్‌ లిహారే అలియాస్‌ దిలీప్‌ (28)కి 2014లో పెళ్లయింది. వీరికి ఏడాది వయసున్న కూతురు ఉంది. భవన నిర్మాణ మేస్త్రి అయిన దిలీప్‌ తన వద్ద కూలి పనులకు వచ్చే మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ జిల్లాకు చెందిన సీమా దమాహే (22)తో ప్రేమ కొనసాగించాడు. తనకు పెళ్లయిన విషయం ఆమె వద్ద దాచి రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెతో కలిసి పనుల కోసం హైదరాబాద్‌ వచ్చేశాడు. వనస్థలిపురంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనంలో ఇద్దరూ పనికి కుదిరారు.

కొన్నాళ్లయ్యాక సొంతూరుకు వెళ్దామని సీమ ఒత్తిడి చేయడంతో దిలీప్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడికి వెళితే తనకు మొదట పెళ్లయి, కూతురు కూడా ఉందన్న విషయం బయటపడుతుందని భావించి సీమాను చంపేయాలనుకున్నాడు. ఈనెల 16న ఆమెను తాము పనిచేస్తున్న భవనం మూడో అంతస్తుకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి తోసేశాడు.

కిందపడి తీవ్రంగా గాయపడిన సీమాను తోటి పనివాళ్లు ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోయింది. అయితే చనిపోయే ముందు తన భర్తే తనను చంపాలని తోసేశాడని పనివాళ్లకు చెప్పడంతో వారు విషయం పోలీసులకు తెలిపారు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న దిలీప్‌ను హన్మకొండలో పోలీసు అరెస్టు చేశారు.

More Telugu News