Kesineni Nani: వల్లభనేని వంశీకి మేము చెప్పాల్సింది చెప్పాం: కేశినేని నాని

  • వంశీతో చర్చించిన కేశినేని నాని
  • ఒత్తిళ్లు ఎదుర్కోవడం సహజమని వ్యాఖ్య
  • వెన్ను చూపడం సరికాదు
  • వంశీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు 

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొన్ని రోజుల క్రితం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీ వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆయనతో టీడీపీ ఎంపీ కేశినేని నాని చర్చించారు.

ఈ విషయంపై కేశినేని మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా రాటుదేలడానికి పోరాడాల్సి ఉంటుందని, ఒత్తిళ్లు ఎదుర్కోవడం సహజమని వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ పోరాడి, గెలిచిన వ్యక్తి ఇప్పుడు వెన్ను చూపడం సరికాదని అన్నారు. ఆయనకు తాము చెప్పాల్సింది చెప్పామని తెలిపారు.

వంశీ ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కేశినేని నాని తెలిపారు. ఆయనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. వంశీకి టీడీపీ ఎంత అవసరమో, టీడీపీకి కూడా ఆయన అంతే అవసరమని వ్యాఖ్యానించారు. 

More Telugu News