Eluru: ఏలూరులో సెక్యూరిటీగార్డు దారుణాలు.. విషం పెట్టి 8 మందిని చంపేశాడు!

  • తన మోసాలు గ్రహించే వారిని విషం పెట్టి చంపిన సెక్యూరిటీ గార్డు
  • పీఈటీ హత్యతో వెలుగు చూసిన నిజాలు
  • ఏలూరులో ముగ్గురు, రాజమహేంద్రవరంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఒకరి హత్య

ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఓ సెక్యూరిటీ గార్డు ఏకంగా 8 మందికి విషంపెట్టి చంపేశాడు. ఏలూరులో జరిగిన ఈ హత్యల బాగోతాలు తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 16న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పీఈటీ కాటి నాగరాజు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోస్టుమార్టంలో అతడు విషప్రయోగం కారణంగా చనిపోయినట్టు తేలింది. ఈ కేసులో ఓ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అతడు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు.

నాగరాజును కాకుండా మరో ఏడుగురిని అతడు చంపినట్టు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఏలూరులో ముగ్గురు, రాజమహేంద్రవరం, బొమ్మూరు పరిధిలో మరో నలుగురు, కృష్ణా జిల్లాలో ఒకరిని ఇలాగే చంపినట్టు నిందితుడు వెల్లడించాడు. ఆహారంలో విషం పెట్టడం ద్వారా వారిని అంతమొందించినట్టు తెలిపాడు.

నిందితుడు నాణేలు, రెండు తలల పాముల పేరిట పలువురిని మోసం చేసేవాడు. ఈ క్రమంలో తన మోసాన్ని పసిగట్టిన వారిని నమ్మకంగా వేర్వేరు చోట్లకు రప్పించి ఆహారంలో, కూల్‌డ్రింకులో విషం కలిపి వారికి అందించి చంపేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

More Telugu News