CPI: పొరుగు రాష్ట్రంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పుడు తెలంగాణలో సమస్య ఏంటి?: సురవరం

  • ఆర్టీసీ సమ్మెపై స్పందించిన సురవరం
  • కార్మికుల హక్కులను అణచివేసే ప్రయత్నమని ఆరోపణ
  • డీజిల్ పై పన్నులు విధించడమే ఆర్టీసీ నష్టాలకు కారణమని వెల్లడి

'తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి స్పందించారు. కార్మికుల హక్కులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన, ఆర్టీసీ ఓ వ్యాపార వ్యవస్థ కాదన్న విషయం ప్రభుత్వం గుర్తెరగాలని హితవు పలికారు. ప్రజా రవాణా వ్యవస్థలో భాగమైన కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి సరికాదని అన్నారు. డీజిల్ పై పన్నులు విధించడం వల్లే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లిందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు సమ్మెకు మద్దతుగా దీక్ష ప్రారంభించగా, ఈ సందర్భంగా సురవరం వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ నుంచి లాభాలు ఎలా ఆశిస్తారని నిలదీశారు. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆర్టీసీని నడిపించాల్సిందేనని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పుడు తెలంగాణలో సమస్య ఏంటని ప్రశ్నించారు.

More Telugu News