Guntur District: ప్రజాధనం దుర్వినియోగం చేస్తే సహించేది లేదు: వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని

  • యడ్లపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ
  • 2018-2019 సంవత్సరం నిధులలో  అవకతవకలు
  • నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే ఆగ్రహం

గుంటూరు జిల్లా యడ్లపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆఫీస్ రికార్డులను పరిశీలించారు. 2018-2019 సంవత్సరానికి గాను నిధులలో తీవ్ర అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఆమె, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు ఒక కోటి 20 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించారు.

దీనిపై అధికారులను వివరణ కోరగా.. ‘సంక్రాంతి సంబరాలకు ఖర్చు పెట్టామని, ప్రభుత్వ వేడుకలకు ఖర్చు పెట్టాం’ అని వారు సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం నుంచి ఈ సంబరాలకు వచ్చే ప్రత్యేక నిధులు ఏమయ్యాయని మాజీ ఎంపీడీఓ స్వరూపరాణిని ప్రశ్నించగా ఆమె తెల్లమొహం వేశారు. ఆ నిధులు దుర్వినియోగం అయినట్టు నిర్ధారణకు వచ్చిన ఎమ్మెల్యే, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పండగలకు, పబ్బాలకు, చికెన్లకు, మటన్లకు ఎంపీపీ నిధులు ఖర్చు పెడతారా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం 25 % నిధులు మాత్రమే ఆఫీస్ ఖర్చులకు వాడాల్సి ఉండగా, 75 % నిధులు అంటే దాదాపు ఒక కోటి 20 లక్షల రూపాయల నిధులు పక్కదారిపట్టడంతో అక్కడి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మాజీ ఎంపీపీ పిల్లి స్టీఫెన్ కరుణాకరన్ అనే వ్యక్తి ఈ నిధులు దుర్వినియోగం అవటానికి ముఖ్య కారణం అని అక్కడ అధికారులు ఆమె దృష్టికి తెచ్చారు. కంప్యూటర్, ఒక కలర్ ప్రింటర్ ను పిల్లి స్టీఫెన్ కరుణాకరన్ తీసుకువెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నారని ఆమెకు అధికారులు చెప్పారు. ఆ వస్తువులు తీసుకొచ్చి ఆఫీస్ లో పెట్టాలని, లేనిచో కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధుల దుర్వినియోగమై జిల్లా కలెక్టర్ ని విచారణ చేపట్టాలని కోరతామని, తప్పు చేసిన అధికారులకు శిక్ష తప్పదని రజిని హెచ్చరించారు.

More Telugu News