East Godavari District: భార్య జ్ఞాపకాలను మర్చిపోలేక.. నాలుగేళ్ల చిన్నారిని చంపి తండ్రి ఆత్మహత్య

  • డెంగీతో మృతి చెందిన భార్య
  • భార్య జ్ఞాపకాలు మర్చిపోలేక మనస్తాపం
  • తాను లేకపోతే కుమార్తె అనాథగా మారుతుందనే చంపేశానంటూ లేఖ

మృతి చెందిన భార్య వదిలివెళ్లిన జ్ఞాపకాలు వెంటాడుతుండడంతో, ఆమెను మర్చిపోలేని ఓ భర్త తన నాలుగేళ్ల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో గురువారం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బాదం చందనకుమార్ (35), శ్రీనవ్య భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం పెళ్లైన వీరికి నాలుగేళ్ల కుమార్తె యోషిత ఉంది. ఇటీవల డెంగీ బారిన పడిన శ్రీనవ్య ఈ నెల 5న మృతి చెందింది.

భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయిన చందనకుమార్ అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉన్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన చందనకుమార్ తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తాను చనిపోతే కుమార్తె యోషిత అనాథగా మారుతుందని భావించాడు. దీంతో కుమార్తెను చంపి ఆపై ఉరివేసుకుని తను ప్రాణాలు తీసుకున్నాడు.

నిన్న ఉదయం చందనకుమార్ చెల్లెలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో పక్కింటి వ్యక్తులకు ఫోన్ చేసి చూడమని చెప్పింది. వారు తలుపులు కొట్టినా తీయకపోవడంతో బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి దృశ్యం చూసి విస్తుపోయి పోలీసులకు సమాచారం అందించారు.

మంచంపై యోగిత విగత జీవిగా కనిపించగా, చందనకుమార్ సీలింగుకి వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాను లేకపోతే తన కుమార్తె అనాథగా మారుతుందన్న ఉద్దేశంతోనే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు.

More Telugu News