Congress: గెలుపు కోసం టీఆర్ఎస్ ఏ టూ జెడ్ అక్రమాలకు పాల్పడింది: పొన్నం ప్రభాకర్

  • ప్రజాస్వామ్యం ఓడింది.. ధనస్వామ్యం గెలిచింది
  • టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే
  • భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం

హుజూర్ నగర్ ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఉపఎన్నికలో ఘోర పరాభవం తప్పలేదు. దీంతో, కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఓటమితో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, ధనస్వామ్యం గెలిచినట్టుగా భావిస్తున్నామని అన్నారు.

ఈ ఎన్నికలో తాము ఓడిపోయామని ఈ వ్యాఖ్యలు చేయడం లేదంటూ.. ‘టీఆర్ఎస్ ఏ టూ జెడ్ అక్రమాలకు పాల్పడింది’ అని ఆరోపించారు. ఈ విషయమై అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని పేర్కొన్నారు. తెలంగాణలో భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News