Telangana: ఉద్యోగం పోతుందని మనస్తాపం.. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్

  • నిజామాబాద్-2 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గఫూర్
  • కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మనస్తాపం
  • ఆసుపత్రికి తరలిస్తుండగానే పోయిన ప్రాణాలు

ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో తెలంగాణలో ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండె ఆగింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల్‌కు చెందిన మహ్మద్‌ గఫూర్‌(34) నిజామాబాద్‌-2 డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత 20 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు ఆర్టీసీ ప్రైవేటు పరం కానున్నదన్న వార్తలతో తీవ్ర కలత చెందాడు. తన ఉద్యోగం ఎక్కడ పోతుందోనని బెంగ పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు విడిచాడు. గఫూర్‌కు భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు.

More Telugu News