Jio: వినియోగదారులను మరోసారి ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్లు తీసుకువచ్చిన జియో

  • జియో నుంచి ఆల్ ఇన్ వన్ ప్లాన్లు
  • రోజుకు 2 జీబీ డేటా
  • ఇతర నెట్ వర్కులకు 1000 నిమిషాల టాక్ టైమ్ ఫ్రీ

జియో ఇటీవల ఇతర నెట్ వర్కులకు నిమిషానికి 6 పైసలు అంటూ అవుట్ గోయింగ్ కాల్ చార్జి ప్రకటించడంతో వినియోగదారులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, తన వినియోగదారులకు ఊరట కలిగించేలా, వారిలో మళ్లీ ఉత్సాహం కలిగించేందుకు జియో సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతోంది. జియో ఆల్ ఇన్ వన్ పేరిట 3 ప్లాన్లు ప్రకటించింది. నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 చొప్పున ఈ ప్లాన్లు ఎంపిక చేసుకోవచ్చు.

ఈ మూడు ప్లాన్లలో రోజుకు 2 జీబీ డేటా లభ్యమవుతుంది. జియో నుంచి జియో నంబర్లకు కాల్స్ ఉచితం. ముఖ్యంగా, ఇతర నెట్ వర్కులకు చేసే కాల్స్ పై 1000 నిమిషాల ఉచిత టాక్ టైమ్ ఆఫర్ చేశారు. ఇటీవల ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీల పేరిట భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుండడంతో జియో ఇతర నెట్ వర్కులకు వెళ్లే అవుట్ గోయింగ్ కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పలు టాప్ అప్ ప్లాన్లు తీసుకువచ్చింది. దాంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తాజాగా ఆల్ ఇన్ వన్ ప్లాన్లు ప్రవేశపెట్టినట్టు అర్థమవుతోంది.

More Telugu News