metro rail: 'ప్రగతి భవన్ ముట్టడి' పిలుపు ప్రభావం.. బేగంపేట మెట్రో స్టేషన్ తాత్కాలికంగా మూసివేత

  • ప్రగతి భవన్ కు దగ్గరలో ఉండడమే కారణం
  • ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  • మెట్రో రైలును బేగంపేట స్టేషన్ వద్ద ఆపకుండా ప్రకాశ్ నగర్ వద్ద ఆపుతున్న వైనం

ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని బేగంపేట మెట్రోస్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రగతి భవన్‌కు సమీపంలోనే ఇది ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తుండడం, మరోవైపు బేగంపేట మెట్రోస్టేషన్‌ కూడా మూసేయడంతో ఇక్కడ దిగాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమీర్ పేట వైపు నుంచి వచ్చే మెట్రో రైలును బేగంపేట స్టేషన్ వద్ద ఆపకుండా ప్రకాశ్ నగర్ వద్ద ఆపుతున్నారు. అలాగే, ప్రకాశ్ నగర్ మీదుగా వెళ్లే సమయంలోనూ బేగంపేట వద్ద ఆపకుండా అమీర్ పేట వద్ద ఆపుతున్నారు. మళ్లీ ఈ మెట్రోస్టేషన్ ను ఎప్పుడు తెరుస్తారన్న విషయంపై అధికారులు స్పష్టతనివ్వలేదు.

More Telugu News