Hyderabad: మాటలు కలిపి, మత్తులో ముంచి.. మత ప్రచారకుడి నుంచి కోటి కొట్టేసే ప్రయత్నం: వగలాడి అరెస్ట్!

  • హైదరాబాద్‌లో ఘటన
  • పథకం ప్రకారం మత ప్రచారకుడిని ముగ్గులోకి దించిన దంపతులు
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు నమ్మించి కోటి రూపాయల డిమాండ్

హోటల్ వ్యాపారంలో నష్టపోయిన ఓ జంట పన్నిన కపట నాటకం బహిర్గతమైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్, సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళ (25) ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసేది. ఆమె భర్తకు నగరంలో ఏడు హోటళ్లు ఉండేవి. అయితే, ఈ వ్యాపారంలో నష్టం రావడంతో బయటపడేందుకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఓ పథకం పన్నారు.

మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లిన మహిళ.. అక్కడి మతప్రచారకుడితో మాటలు కలిపింది. సికింద్రాబాద్‌లో తాను చిన్నారుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో అతడి ఫోన్ నంబరు తీసుకున్న మహిళ.. తరచూ వాట్సాప్ చాటింగ్ చేసేది. అలా అతడికి మరింత దగ్గరైంది. అది కాస్తా పార్క్‌లకు వెళ్లే వరకు మారింది. ఈ క్రమంలో ఓసారి చిలుకూరు, మరోసారి శంషాబాద్, ఇంకోసారి వండర్‌లాండ్‌కు అతడిని రప్పించింది. ఈ సందర్భంగా వారు ఫొటోలు తీసుకోవడంతోపాటు మహిళకు సంబంధించిన వ్యక్తులు కూడా వారిని అనుసరించి రహస్యంగా ఫొటోలు తీసేవారు.

పరిచయం మరింత బలపడడంతో తన అసలు పథకానికి తెరతీసింది. హోటల్ వ్యాపారంలో ఉన్న తన భర్త విజయవాడలో వ్యాపారం ప్రారంభించనున్నాడని, పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఆమెను నమ్మిన బాధితుడు రూ.10 లక్షలు సమర్పించుకున్నాడు. చర్చల కోసం విజయవాడ నుంచి ప్రతినిధులు వస్తున్నారని గతనెలలో అతడితో చెప్పిన నిందితురాలు.. శంకర్‌పల్లిలోని ఓ రిసార్టుకు రప్పించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న వ్యక్తులు అతడిని ఓ గదిలో వేచి చూడమని చెప్పారు. ఆ రాత్రి అకస్మాత్తుగా గదిలో ప్రత్యక్షమైన మహిళ నిద్రమాత్రలు కలిపిన డ్రింక్ ఇచ్చింది. అది తాగి అతడు మత్తులోకి జారుకున్న తర్వాత.. అతడితో సన్నిహితంగా ఉన్నట్టు ఫొటోలు, వీడియోలు తీసుకుంది. బాధితుడికి ఉదయం మెలకువ వచ్చేసరికి బాత్‌టబ్‌లో ఉండడంతో షాకయ్యాడు.

అదే సమయంలో అక్కడికి చేరుకున్న మహిళ భర్త.. మత ప్రచారకుడిని గదిలోకి తీసుకొచ్చి భార్యను, అతడిని కలిపి చితక్కొట్టాడు. ఇద్దరి మధ్య ఏం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుపాకి చూపించి చంపేస్తానని బెదిరించాడు. దీంతో తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడ్డాడు. చివరికి కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని అతడిని వదిలిపెట్టాడు. ఆ తర్వాతి రోజు డబ్బుల కోసం అతడికి ఫోన్ చేయడంతో రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి పన్నాగం బయటపడింది. ఈ పథకం కోసం మహిళ భర్త నాంపల్లిలో బొమ్మ తుపాకి కొన్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఓ ప్రవాస భారతీయుడికి కూడా ఇలానే టోపీ వేసేందుకు ప్రయత్నించారని, అతడితో చాటింగ్ కూడా మొదలుపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News