Ganguly: ఆ సమయంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడై ఉంటే బాగుండేది: యువరాజ్ సింగ్

  • బోర్డు పగ్గాలందుకోబోతున్న గంగూలీ
  • శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్
  • యోయో టెస్టుపై దాదా సరైన నిర్ణయం తీసుకునేవాడని వెల్లడి

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకముందే సౌరవ్ గంగూలీ ప్రాబల్యం విస్తరిస్తోంది. ఆయనకు భారత క్రికెట్ లోని అన్ని వర్గాలు మద్దతిస్తున్నాయి. ఆటలో, మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే గంగూలీ, రిటైర్మెంటు తర్వాత క్రికెట్ వ్యవహారాల్లో పరిణతితో కూడిన పాలనాదక్షత కనబరుస్తున్నాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోబోతున్నా, గంగూలీ సామర్థ్యంపై ఎవరికీ సందేహాల్లేవు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా అదే మాట అంటున్నాడు.

ఓ గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, కొన్నాళ్ల కిందట భారత క్రికెట్ లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యుంటే ఎంతో బాగుండేదని, యోయో టెస్టుపై ఆటగాళ్ల దృక్కోణం నుంచి ఆలోచించగల వ్యక్తిగా గంగూలీ సరైన నిర్ణయం తీసుకుని ఉండేవాడని యువరాజ్ పేర్కొన్నాడు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సరికొత్త పదవి చేపడుతున్న సందర్భంగా దాదాకు యువీ శుభాకాంక్షలు తెలిపాడు.

More Telugu News