Manmohan Singh: ప్రత్యర్థులను విమర్శించడమే సమస్యలకు పరిష్కారమా?: కేంద్రానికి మన్మోహన్ సింగ్ సూటిప్రశ్న

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  విమర్శలపై స్పందన
  • మా కంటే ముందు, తర్వాత ఎన్డీఏ అధికారంలో ఉంది అప్పుడు ఏం చేశారు
  • తప్పంతా మాదేనని అరోపించడం తగదు

ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని సంకల్పించినప్పుడు ముందుగా లోపాలు గుర్తించి..  కారణాలను అన్వేషించాల్సి ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రస్తుత దుస్థితికి కారణం యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అనుసరించిన విధానాలే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు మన్మోహన్ బదులిచ్చారు. ‘సమస్య పరిష్కారం కోసం కృషి చేయడానికి బదులుగా ఎన్డీఏ నిరంతరంగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తోంది. అదే పరిష్కారమని భావిస్తున్నట్లుంది’ అని మన్మోహన్ సింగ్  మీడియాతో భేటీలో అన్నారు.  

ఈ సందర్భంగా ఇటీవల వెలుగు చూసిన మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ సమస్యను ఎత్తి చూపుతూ.. మీ హయాంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఏమంటారు? అంటూ మన్మోహన్ నిలదీశారు. పీఎంసీ తనపై భరోసా ఉంచిన 16 లక్షల డిపాజిట్ దారుల భవిష్యత్తును కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. ‘నేను ప్రధానిగా ఉన్నప్పుడు పీఎస్ బీలు సమస్యల్లో కూరుకుపోయాయని అంటున్నారు. మేము 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నాము. అంతకు ముందు మీరు అధికారంలో ఉన్నారు. మళ్లీ   2014 నుంచి మీరు ఐదేళ్లు పాలన చేశారు. మొత్తం తప్పంతా యూపీఏదేనని ఆరోపించడం తగదు’ అని సింగ్ వ్యాఖ్యానించారు.

 మంత్రి పీయూష్ గోయల్ ప్రతి విమర్శ

మన్మోహన్ సింగ్ తన వైఫల్యాలను గుర్తించాలి. బలమైన ఆర్థిక వ్యవస్థను కొనసాగించలేకపోవడంతోపాటు, నిజాయతీతో కూడిన ప్రభుత్వ పాలనను అందించలేకపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతిలో కీలుబొమ్మై సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు’ అని గోయల్ ప్రతి విమర్శ చేశారు.

More Telugu News