Tamil Nadu: వేర్వేరు ఘటనలలో ఒకేరాత్రి ఆరు హత్యలు!

  • చెన్నై పరిసరాల్లో వేర్వేరు కారణాలతో ఆరుగురు వ్యక్తుల హత్య
  • నిందితుల కోసం పోలీసుల వేట
  • భయపడుతున్న నగర వాసులు

చెన్నైలో సోమవారం రాత్రి ఆరుగురు హత్యకు గురికావడం సంచలనమైంది. ఏం జరుగుతోందో తెలియక జనాలు భయంతో వణికిపోతున్నారు. నగర శివారులోని వేళచ్చేరి సమీపంలోని పెరుంబాక్కం ఇందిరానగర్‌కు చెందిన ఆనంద్‌(29), స్టీఫెన్‌(23)లు మద్యం తాగేందుకు  సమీపంలోని టాస్మాక్‌ మద్యం దుకాణానికి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా మందుకొట్టి వస్తుండగా మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురితో వీరికి వాగ్వివాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ ఆరుగురూ ఆనంద్, స్టీఫెన్‌లను కిరాతకంగా నరికి చంపారు. గతవారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన గొడవే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరో ఘటన కిట్టాలాచ్చి నగర్‌లో జరిగింది. రంజిత్ కుమార్, శుభా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. శుభ ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధ పెట్టుకుని ఇంటి నుంచి ఉడాయించగా, రంజిత్ కుమార్.. గోమతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రంజిత్‌కుమార్, గోమతి గదిలో ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు అతడిని దారుణంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి గోమతి తప్పించుకుంది.

నామక్కల్‌లో విమల్‌ రాజ్, అనిత దంపతులు హత్యకు గురయ్యారు. అనిత సోదరుడు అరుణ్ మరో మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ కేసులో అరుణ్ స్నేహితుడు నికల్సన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పుదుకోట్టైలో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి సమీప బంధువు వినోద్ చక్రవర్తి హత్యకు గురయ్యాడు. ఇలా వేర్వేరు కారణాలతో ఒకే రోజు ఆరుగురు హత్యకు గురికావడం నగరంలో సంచలనంగా మారింది.

More Telugu News