Shar: షార్ రాకెట్ అనుసంధాన భవనంలో ప్రమాదం!

  • రెండో వాహన అనుసంధాన యూనిట్ లో ప్రమాదం
  • రూ. 2 కోట్ల నష్టం
  • ప్రాణనష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

షార్ (సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం)లోని రెండో వాహన అనుసంధాన భవనంలో పెను ప్రమాదం జరిగింది. రాకెట్‌ పరికరాలు అనుసంధానం చేసే ప్లాట్‌ ఫారాలు కూలాయి. ఈ ప్రమాదంలో రూ. 2 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టమూ జరుగలేదు.

షార్‌ లోని రెండో వీఏబీ భవనంలో రాకెట్‌ లను ఎటాచ్ చేసే ప్లాట్‌ ఫారాలుండగా, పరికరాలు మోసుకెళ్లే గేర్‌ బాక్స్‌ లో టెక్నికల్ ఫాల్ట్ ఏర్పడి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని సరిచేస్తుండగా, ఇంధనం లీక్ అయిందని, అదే సమయంలో రెండు ప్లాట్‌ ఫారాలు కూలాయని అధికారులు తెలిపారు.

ఆ సమయంలో ఉద్యోగులు, సిబ్బంది టీ తాగేందుకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన షార్‌ అధికారులు, ఉన్నతాధికారులకు విషయం తెలుపగా, ప్రత్యేక కమిటీని నియమించిన అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

కాగా, ఈ వాహన అనుసంధాన భవనం ఈ సంవత్సరం జూలై 14న ప్రారంభం అయింది. 3 నెలలు కూడా గడువక ముందే నాణ్యతా లోపాలు బయటపడటం, ప్రమాదం జరగడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News