Bhadradri Kothagudem District: అశ్వారావుపేటలో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై ఎయిడ్స్‌ రోగి అత్యాచారం

  • జ్వరంతో నిద్రిస్తున్న బాలికపై అఘాయిత్యం
  • పక్కంటి కుర్రాడే దారుణానికి తెగబడిన వైనం
  • పరారీలో నిందితుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మహిళ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. వారింటికి సమీపంలోనే ఉండే 23 ఏళ్ల యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న యువకుడు టీవీ చూసేందుకు తరచూ మహిళ ఇంటికి వచ్చేవాడు.

మహిళ ఏడేళ్ల కుమార్తెకు సోమవారం జ్వరం రావడంతో మందులు వేసి నిద్రపుచ్చిన తల్లి అనంతరం కూలి పనులకు వెళ్లింది. ఆ తర్వాత వారింటికి వెళ్లిన నిందితుడు ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో  ఇంటికి వచ్చిన మహిళ ఘోరాన్ని చూసి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News