KIA: సెల్టోస్ అమ్మకాలతో కియా ఆనందం... మరో రెండు కొత్త మోడళ్లకు రంగం సిద్ధం

  • కార్నివాల్, క్యూవైఐ మోడళ్లను తీసుకువస్తోన్న కియా
  • వచ్చే ఏడాది ఆటో ఎక్స్ పోలో ప్రదర్శన
  • ఇన్నోవా క్రిస్టా, హ్యుందాయ్ వెన్యూలకు పోటీ ఇవ్వనున్న కియా కార్లు!

ప్రపంచస్థాయి కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ త్వరలోనే భారత్ లో మరో రెండు కొత్త మోడళ్లు తీసుకురావాలని భావిస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండ ప్లాంట్ లో తయారైన సెల్టోస్ అమ్మకాల పరంగా ముందంజలో ఉండడంతో కియా వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఉత్సాహంలో కొత్త మోడళ్లను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రీమియం సెగ్మెంట్లో కార్నివాల్ వాహనాన్ని తీసుకురావాలనుకుంటున్న కియా, ఎస్ యూవీ విభాగంలో క్యూవైఐ కారును పరుగులు తీయించాలని నిర్ణయించుకుంది.

ఇన్నోవా క్రిస్టాకు కార్నివాల్ బలమైన పోటీదారుగా ఇప్పటికే ఆటోమొబైల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది నాలుగేళ్ల కిందటే అమెరికాలో అడుగుపెట్టింది. ఇక హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్ యూవీ, విటారా బ్రెజాలకు దీటుగా కియా క్యూవైఐ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కియా కొత్త మోడళ్లను వచ్చే ఏడాది జరిగే ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించి ఆపై మార్కెట్లో అందుబాటులో ఉంచుతారని తెలుస్తోంది. కాగా, కియా కార్నివాల్ ధర పాతిక లక్షల వరకు ఉండొచ్చన్నది అనధికార సమాచారం.

More Telugu News