Crime News: అనారోగ్యంతో లేవలేని స్థితిలోవున్న వృద్ధురాలిపై అఘాయిత్యం...హత్య

  • ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణం
  • ఆలయంలో తలదాచుకుంటుండగా అకృత్యం
  • సీసీ పుటేజీలో నిందితుడిని గుర్తించిన పోలీసులు

మద్యం మత్తులో కన్నూమిన్నూగానక ఆలయాన దేవుని సన్నిధిలోనే దారుణానికి ఒడిగట్టాడో కామాంధుడు. అనారోగ్యంతో లేవలేని స్థితిలో పడివున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. హైదరాబాద్‌ గోషామహల్‌ డివిజన్‌ కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. భర్త దూరమైన ఓ వృద్ధురాలు (68) కొడుకుతోపాటు జియాగూడలో ఉండేది. కొడుకుకు పెళ్లి చేసినా అతని మానసిక స్థితి సరిగాలేని కారణంగా భార్య వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత పలుచోట్ల తల్లీకొడుకులు నివాసం ఉన్నారు. రజక వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందేవారు. చివరికి ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితుల్లో పురానాపూల్‌లో ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నారు.

ఇటీవల వర్షాలతో సమీపంలోని ఆలయ ప్రాంగణంలో తల్లీ కొడుకులు ఉంటున్నారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం వల్ల వృద్ధురాలు లేవలేని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న కొడుకు తల్లీ నిర్జీవంగా పడివుండడాన్ని గుర్తించి ఆలయ నిర్వాహకులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించారు. మధ్యాహ్నం ఓ తాగుబోతు వృద్ధురాలు నిద్రిస్తున్న ప్రదేశంవైపు వెళ్లినట్లు గుర్తించాడు. దీంతో అతనే దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావించి అతని కోసం వెతుకుతున్నారు.

More Telugu News