Virat Kohli: మరో రికార్డును కొట్టిన విరాట్ కోహ్లీ!

  • సెహ్వాగ్ రికార్డు తెరమరుగు
  • భారత్ క్రికెటర్లలో అత్యధిక డబుల్ సెంచరీల వీరుడిగా కోహ్లీ
  • 81 టెస్టుల్లో ఘనతl

భారత పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు ఒదిగిపోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఢిల్లీ డైనమైట్ కు ఇది 7వ డబుల్ సెంచరీ. తద్వారా భారత్ తరఫున అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డుల పుటల్లోకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 6 డబుల్ సెంచరీల రికార్డును ఢిల్లీకే చెందిన కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం.

అంతేకాదు, ప్రపంచ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో నాలుగోస్థానానికి ఎగబాకాడు. కేవలం 81 టెస్టుల్లోనే కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ (52 టెస్టులు) ఉన్నాడు. డాన్ ఖాతాలో 12 డబుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (134 టెస్టులు) 11 ద్విశతకాలతో రెండో స్థానంలోను, 9 డబుల్ సెంచరీలతో వెస్టిండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రియాన్ లారా (131 టెస్టులు) మూడో స్థానంలోను ఉన్నారు.

ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 7000 పరుగులు సాధించాడు. ఏడు వేల పరుగుల మైలురాయిని ఓ డబుల్ సెంచరీతో సాకారం చేసుకున్న తొలి బ్యాట్స్ మన్ కోహ్లీనే!

More Telugu News