Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేయనున్న రవిప్రకాశ్

  • రవిప్రకాశ్ పై సీజేఐకు లేఖ రాసిన విజయసాయిరెడ్డి
  • పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపిన రవిప్రకాశ్ మేనేజర్
  • తప్పుడు వార్తలు ప్రసారం చేసిన చానళ్లపై కూడా కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేయబోతున్నారు. ఈ విషయాన్ని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. రవిప్రకాశ్ పై అసత్య ఆరోపణలు చేసి, ఆయన పరువుకు భంగం కలిగించినందుకు దావా వేయబోతున్నట్టు వెల్లడించారు. టీవీ9లోకి మైహోం రామేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డి చట్ట వ్యతిరేకంగా ప్రవేశించారని... రవిప్రకాశ్ పై వారిద్దరే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారు.

రామేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డి అనుచరుడు రామారావు లిఖితపూర్వకంగా తమ ఆరోపణలను వివిధ శాఖలకు గత నెలలో పంపించారని... అయితే ఇవన్నీ గాలి ఆరోపణలని అధికారులు తేల్చారని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. రామారావు పంపిన లేఖ ప్రతినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై పంపించారని చెప్పారు. వీరు చేసిన నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేసిన చానళ్లపై కూడా కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

More Telugu News