Fire Accident: అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం.. మరొకరి పరిస్థితి విషమం

  • విశాఖ నగరంలో ఘటన
  • సాగర్‌నగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో దుర్ఘటన
  • ఘటనపై భిన్న కథనాలు

విశాఖ నగరం సాగర్‌నగర్‌ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కొడుకు, కుమార్తె సజీవ దహనం కాగా, తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఆత్మహత్యా యత్నమా? అన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే...బీచ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న సాగర్‌నగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో చల్లా ఉమామహేశ్వరరావు, ఆయన కొడుకు, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం ఉన్నట్టుండి వారి ఇంటి నుంచి హఠాత్తుగా పొగలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడి వెళ్లారు. చూడగా ఇంట్లో అగ్నికీలలు అలముకుని, కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తున్నారు.

దీంతో బాధితులను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే అప్పటికే కొడుకు సతీష్‌చంద్ర, కుమార్తె లావణ్య చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఉమామహేశ్వరరావును స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా, ఈ ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News