Air India: మరో వారంలో విమానయాన సంక్షోభం... నిలిచిపోనున్న ఎయిరిండియా సేవలు!

  • చమురు కంపెనీలకు రూ. 5 వేల కోట్ల బకాయిలు
  • 18 నుంచి ఏటీఎఫ్ ను అందించబోమన్న ఐఓసీలు
  • ఇప్పటికే రూ. 60 వేల కోట్ల అప్పుల్లో ఎయిరిండియా

మరో వారం రోజుల తరువాత, అంటే, ఈ నెల 18 నుంచి భారత విమానయాన రంగంలో సంక్షోభం మొదలు కానుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)ను సరఫరా చేయబోమని చమురు రంగ కంపెనీలు తేల్చి చెప్పాయి.

పాత బకాయిలను చెల్లించేంత వరకూ ఏఐకి ఇంధనాన్ని అందించబోమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు చెప్పేశాయి. గడచిన 8 నెలలుగా ఈ కంపెనీలకు ఏఐ ఇంధనానికి డబ్బులు కట్టలేదు. దీంతో రూ. 5000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.

గత ఆగస్టులోనూ ఇదే విధమైన నిర్ణయాన్ని చమురు కంపెనీలు తీసుకోగా, కేంద్ర పౌర విమానయాన శాఖ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దింది. ఆపైనా బకాయిలు వసూలు కాకపోవడంతో చమురు కంపెనీలు ఇప్పుడు అల్టిమేటం ఇచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎయిరిండియా రూ. 60 వేల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఏటీఎఫ్ సరఫరాను నిలిపివేస్తే, ఏఐ విమానాల సేవలు నిలిచిపోవడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే, భారత ఏవియేషన్ ఇండస్ట్రీలో సంక్షోభం మొదలైనట్టేనని, ప్రయాణికుల అవసరాలను, డిమాండ్ కు తగ్గట్టు సర్వీసులను నడిపించడంలో ప్రైవేట్ సంస్థలు విఫలం అవుతాయని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News