India: రెండో టెస్టులోనూ ఇరగదీసిన మయాంక్.. భారీ స్కోరు దిశగా భారత్

  • 108 పరుగుల వద్ద ఔట్ అయిన మయాంక్ అగర్వాల్
  • 14 పరుగులతో నిరాశ పరిచిన రోహిత్ శర్మ
  • భారత్ స్కోరు: 238 / 3

టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన జోరును కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో విశాఖలో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్... పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో కూడా సత్తా చాటాడు. సెంచరీ సాధించి, భారత్ భారీ స్కోరు సాధించేందుకు పునాది వేశాడు.

పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్ ను మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు ప్రారంభించారు. అయితే తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత పుజారాతో కలిసి మయాంక్ భారత ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఈ క్రమంలో 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ సిరీస్ లో రెండో సెంచరీని సాధించిన మయాంక్... 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లీ (37), రహానే (9) క్రీజులో ఉండగా, భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు. ఈ మూడు వికెట్లనూ రబాడా పడగొట్టడం గమనార్హం.

More Telugu News