Jeevita: అప్పుడు చిరంజీవిని కలిసినంత మాత్రాన అలా రాసేస్తారా: జీవితా రాజశేఖర్

  • పాత విషయాలు గుర్తు చేసుకున్న జీవిత
  • చిరంజీవి ఫ్యామిలీతో సత్సంబంధాలే ఉన్నాయి
  • ఎప్పుడు కలిసినా చక్కగా మాట్లాడుకుంటామన్న జీవిత

మెగాస్టార్ చిరంజీవి, నటుడు రాజశేఖర్ మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని, వారి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా కాలం వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఓ దశలో చిరు అభిమానులు హైదరాబాద్ నడిరోడ్లపై రాజశేఖర్ ను అవమానించారు కూడా. ఈ ఘటనలపై రాజశేఖర్ భార్య జీవిత తాజాగా స్పందించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో కొందరు నచ్చుతారు, మరికొన్ని సందర్భాల్లో కొందరు నచ్చరు. అలాగని వారితో శత్రుత్వం ఉన్నట్టు కాదని స్పష్టతనిచ్చారు.

ఈ సందర్భంగా 'గరుడవేగ' చిత్రం విడుదలైన తరువాత జరిగిన ఘటనను, ఫ్యాన్స్ గొడవను ఆమె గుర్తు చేసుకున్నారు. తన భర్త చాలా ఓపెన్ హార్ట్ తో ఉంటారని చెప్పుకొచ్చారు. రాజశేఖర్, చిరంజీవి వద్దకు వెళ్లి 'గరుడవేగ' చిత్రాన్ని చూడాలని కోరగా, అప్పుడు తమ హీరోను తిట్టిన రాజశేఖర్, ఇప్పుడు వెళ్లి సినిమాను చూడటం ఏంటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ చేశారని, సినిమా మరింత కలెక్షన్లు సాధించాలనే ఇలా చేశారని కూడా విమర్శించారని అన్నారు. అయితే, చిరంజీవితో తమ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన్ను చాలా ఫంక్షన్లలో కలుస్తామని, బాగా మాట్లాడుకుంటామని అన్నారు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తరువాత ఆ స్థాయిని సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవేనని, వెబ్ సైట్లలో రాసిన రాతలను ఎవరమూ పట్టించుకోలేదని చెప్పారు. 'గరుడవేగ' చిత్రాన్ని చూసి చిరంజీవి తన అభిప్రాయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆయన్ను కలిశామని అన్నారు. అయితే, అంతకుముందు తమ గురించి రాసిన వార్తలు ఆవేదనను కలిగించాయని చెప్పారు.

More Telugu News