Visakhapatnam: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు!

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
  • ఒడిశాలో మరో ఉపరితల ఆవర్తనం
  • హెచ్చరికలు జారీ చేసిన విశాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకూ తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు పేర్కొంది. అలాగే, మధ్య ఒడిశా ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వివరించింది. అలాగే, ఉరుములతో కూడిన జల్లులు కూడా కురుస్తాయని పేర్కొంది.

More Telugu News