Rohit Sharma: రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. భారీ స్కోరు దిశగా భారత్

  • 133 బంతుల్లో శతకాన్ని బాదిన రోహిత్
  • రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ సాధించిన హిట్ మ్యాన్
  • 281 పరుగుల ఆధిక్యతలో భారత్

టీమ్ ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికాతో వైజాగ్ లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించాడు. 133 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 176 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఓపెనర్ గా ఆడిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసిన ఘనతను రోహిత్ సాధించాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్ లో నిరాశ పరిచాడు. కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం రోహిత్ కు జత కలిసిన పుజారా అద్భుతంగా ఆడి 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు. రోహిత్ 105, జడేజా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తమ్మీద 281 పరుగుల లీడ్ లో భారత్ ఉంది.

More Telugu News