Telangana: ఆర్టీసీ చర్చలు విఫలం.. సమ్మె తప్పదన్న కార్మికులు.. ప్రయాణికుల ఆందోళన

  • గురువారం జరిగిన చర్చలు కూడా విఫలం
  • మెట్టు దిగని ఆర్టీసీ కార్మిక సంఘాలు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి

ఆర్టీసీ కార్మిక సంఘాలతో గురువారం జరిగిన మలిదశ చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి సమ్మె తప్పదని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఫలితంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. మరోవైపు, సమ్మెకు వెళ్తే ‘ఎస్మా’ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఇటువంటి వాటికి తాము భయపడబోమని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.

కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె కనుక కొనసాగితే, ప్రత్యామ్నాయంగా ఆరేడు వేల బస్సుల్ని నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైల్వే శాఖ అదనపు రైళ్లు నడుపుతున్నా అవి సరిపోవన్నది ప్రభుత్వం యోచన. ప్రస్తుతం ఆర్టీసీలో తిరుగుతున్న 2100 అద్దె బస్సుల్ని యథాతథంగా నడపడంతోపాటు మరో 2 వేల బస్సులకు రోజువారీ పర్మిట్లు ఇచ్చి నడపాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, ప్రస్తుతం విద్యాసంస్థలకు దసరా సెలవులు కావడంతో ఆ బస్సులను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
 
పండుగ సమయాల్లో నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి సిటీ బస్సులను కూడా దూర ప్రాంతాలకు కేటాయించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రైవేటు, విద్యాసంస్థల బస్సులను సమీకరించే బాధ్యతను ప్రభుత్వం రవాణా శాఖకు అప్పగించింది. అలాగే, ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు, చర్చలు కొలిక్కి రాకపోవడంతో పండుగ ప్రయాణాలకు సిద్ధమవుతున్న నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News