Railway: ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుందామనుకున్న రైల్వే... సూపర్ ప్లాన్ వేసిన జనాలు!

  • ప్లాట్ ఫామ్ టికెట్ రేటు రూ.10 నుంచి రూ.30కి పెంపు
  • పాసింజర్ రైలు టికెట్ కొనడం మొదలుపెట్టిన ప్రజలు
  • పాసింజర్ రైలు మినిమమ్ టికెట్ ధర రూ.10 మాత్రమే

దసరా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచడం తెలిసిందే. రూ.10 టికెట్ ను ఏకంగా రూ.30కి పెంచేశారు. అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఉత్తి పుణ్యానికి రూ.30 చెల్లించాల్సి రావడం ఎందుకనుకున్న ప్రజానీకం అదిరిపోయే ప్లాన్ తో రైల్వే శాఖకు షాకిచ్చింది. రైల్వే స్టేషన్ కు వెళ్లే క్రమంలో ప్లాట్ ఫామ్ టికెట్ కు బదులు పాసింజర్ ట్రైన్ టికెట్ కొనడం మొదలుపెట్టారు.

పాసింజర్ ట్రైన్ మినిమమ్ చార్జి రూ.10 కాగా, పది రూపాయలు పెట్టి పాసింజర్ టికెట్ కొని దర్జాగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్నారు. ఈ విధంగా రూ.20 ఆదా చేస్తున్నారు. అంతేకాదు, స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ వద్ద ఉన్న పాసింజర్ టికెట్ ను ఇతరులకు ఇచ్చేస్తున్నారు. ప్లాట్ ఫామ్ టికెట్ల కన్నా పాసింజర్ టికెట్ల అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించడంతో అధికారులు ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది. ఏదేమైనా రైల్వే అధికారులు ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచేటప్పుడు ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారనే చెప్పాలి.

More Telugu News