Medak District: నీటి గుంతలో మునిగిపోతున్న తమ్ముడిని కాపాడి ప్రాణాలొదిలిన అన్నాచెల్లెళ్లు!

  • మెదక్ జిల్లాలో ఘటన
  • పెళ్లి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం
  • గ్రామంలో విషాదం

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. నీటిలో మునిగిపోతున్న తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన ప్రశాంత్ (20), గుండ్లపల్లికి చెందిన పావని (17)లు కుటుంబ సభ్యులతో కలిసి ఘనపూర్‌లో ఓ పెళ్లికి హాజరయ్యారు.

సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులో ఉన్న నీటి గుంతలో ఈత కొట్టేందుకు వైష్ణవి, సౌమ్య, ప్రశాంత్, వినోద్‌కుమార్, పవిత్ర, పూజిత, పావనిలు ఈతకు దిగారు. ఈ క్రమంలో గుంతలోకి దిగిన వినోద్‌కుమార్ నీటిలో మునిగిపోతుండడాన్ని గమనించిన అన్నాచెల్లెళ్ల వరుసైన ప్రశాంత్, పావనిలు అతడిని రక్షించే ప్రయత్నం చేశారు.

వారికి ఈత రాకున్నా గుంతలోకి దిగి వినోద్‌ను కాపాడారు. ఈ క్రమంలో వారిద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News