Khammam District: రెండు రూపాయలు తీసిందన్న కోపంతో పదేళ్ల కుమార్తె శరీరంపై కర్రుకాల్చి వాతలు పెట్టిన తల్లి

  • ఖమ్మం జిల్లా పేరుపల్లిలో ఘటన
  • బాలిక అరుపులు విని రక్షించిన ఇరుగుపొరుగువారు
  • చిన్నారిని ఖమ్మం బాలసదనానికి తరలించిన ఐసీడీఎస్ సీడీపీవో

ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఓ తల్లి తన కుమార్తెకు నరకం చూపించింది. కేవలం రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కర్రు కాల్చి వాతపెట్టింది. నొప్పికి తాళలేక చిన్నారి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రావడంతో విషయం బయటపడింది. మండలంలోని పేరుపల్లికి చెందిన ఓ మహిళ తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో మండుతున్న కర్ర తీసి అరచేతిపైనా, ఒంటిపైనా వాతలుపెట్టింది.

చిన్నారి అరుపులు విని ఇంట్లోకి వెళ్లిన చుట్టుపక్కల వాళ్లు తల్లి రాక్షసత్వాన్ని చూసి నివ్వెరపోయారు. ఆమె నుంచి ఆ బాలికను విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపైనా ఆ మహిళ అంతెత్తున లేచింది. రెండు రోజుల క్రితం కూడా పారతో తన ముఖంపై కొడితే పళ్లు ఊడొచ్చాయని బాలిక చెబుతుంటే చుట్టుపక్కలవారు చలించిపోయారు.

విషయం తెలిసిన ఐసీడీఎస్ సీడీపీవో దయామణి, అంగన్‌వాడీ సెక్టార్ పర్యవేక్షకురాలు పుష్పావతిలు సోమవారం బాధిత బాలిక ఇంటికి వెళ్లి విచారించారు. బాలిక శరీరంపై గాయాలు చూసి వెంటనే చికిత్స నిమిత్తం ఖమ్మంలోని బాలసదనానికి తరలించారు. పుష్పావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News