Crime News: 'అమ్మా' అని పిలుస్తూనే యువకుడి వికృత చేష్టలు.. లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య

  • శ్రీకాకుళం జిల్లాలో మావవ మృగం
  • సూసైడ్‌ నోట్‌తో బయటపడిన నిజం
  • నిందితుడికి మరో ఇద్దరు సహకరించినట్టు ఆరోపణ

పరిచయం అయిన ఆ యువకుడు అమ్మా, నాన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటే ఆ దంపతులు పొంగిపోయారు. కళ్లలో కామ విషాన్ని నింపుకొని మాటలతో మాయ చేస్తున్నాడని గుర్తించలేకపోయారు. సదరు మహిళ స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియో తీసి అనంతరం ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. శృతిమించిన లైంగిక వేధింపులు భరించలేక సదరు ప్రబుద్ధుడి వికృతి చేష్టలు తెలియజేస్తూ లేఖ రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.

మాధవ్ అనే వ్యక్తి ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌. గతంలో కంచిలిలో పనిచేసినప్పుడు స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో అద్దె ఇంట్లో ఉండేవాడు. అదే ఇంటి కింది పోర్షన్‌లో ఏపీజీవీ బ్యాంక్‌ ఉండేది. అక్కడ పనిచేస్తున్న దంపతులతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉండేవాడు. అమ్మా, నాన్నా అని వారిని పిలిచేవాడు. ఈ క్రమంలో ఆ మహిళ ఓసారి స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు.

అనంతరం దాన్ని చూపించి ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. అయినా ఆమె అతనికి చిక్కలేదు. ఈలోగా మాధవ్ కు వేరే ప్రాంతానికి బదిలీ అయింది. ఆ తర్వాత కూడా మాధవ్ తన వేధింపులు ఆపలేదు. వారం రోజుల క్రితం కంచిలి వచ్చిన మాధవ్ సదరు వివాహితను మళ్లీ బెదిరించాడు. దీంతో విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

దీంతో వారంతా మాధవ్‌ను మందలిద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ఈలోగా ఏం జరిగిందో సదరు వివాహిత గురువారం అర్ధరాత్రి తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ మాధవ్‌ చేష్టలను, అతనికి సహకరించిన మరో ఇద్దరి తీరును తెలియజేస్తూ సూసైడ్‌ నోట్‌ రాసింది. కుమార్తె మరణ సమాచారం అందడంతో ఒడిశాలో ఉన్న ఆమె తల్లిదండ్రులు వచ్చి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News