Volkswagen: ఫోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి బొత్స

  • రూ. 11 కోట్ల ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం
  • సాక్షిగా కోర్టుకు హాజరైన బొత్స
  • ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారించిన సీబీఐ

ఫోక్స్ వ్యాగన్ కేసులో హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సంస్థ కోసం వశిష్ట వాహన్ అనే సంస్థకు రూ. 11 కోట్లు చెల్లించిన కుంభకోణంలో సాక్షిగా బొత్స కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో అళగ రాజా, వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్, జైన్, గాయత్రిలపై సీబీఐ అభియోగాలు మోపి, కేసులు నమోదు చేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విశాఖలో కార్ల ఫ్యాక్టరీ స్థాపన కోసం ఫోక్స్ వ్యాగన్ కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే, తమకు వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్ తో ఎలాంటి సంబంధం లేదని ఫోక్స్ వ్యాగన్ ప్రకటించింది. ఈ అంశంలో అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం కేసును సీబీఐకి రాజశేఖరరెడ్డి అప్పగించారు. 2005లో కేసు నమోదు చేసిన సీబీఐ... ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారించింది. 3 వేల పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది.

More Telugu News