Crime News: మహిళపై అత్యాచారం, హత్య.. నిందితుడి అరెస్టు

  • మద్యం మత్తులో ఉండగా బలవంతం
  • ఎదురు తిరిగేసరికి బండరాయితో మోదిన వైనం
  • అపస్మారక స్థితికి వెళ్లగానే ఘాతుకం

మద్యం మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం చేయబోయి, ఆమె ఎదురు తిరిగేసరికి కొట్టి చంపేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు...నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన ఓ మహిళ (43) భర్తతో విభేదాల కారణంగా హైదరాబాద్‌ చంపాపేటలో తన సోదరి కూతురు వద్ద ఉంటోంది.

సైదాబాద్‌, చంపాపేట పరిసరాల్లోని ఫంక్షన్‌ హాళ్లలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. ఈనెల 11న ఎప్పటిలాగే ఆమె పనిలోకి వెళ్లింది. ఆ రాత్రి ఆమెకు మద్యం దుకాణం వద్ద నల్గొండ జిల్లా చందంపేట మండలం పోల్యానాయక్‌ తండాకు చెందిన రమావత్‌ శుక్రూనాయక్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ఆమెను బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

అక్కడ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నిస్తే ఆమె ప్రతిఘటించింది. దీంతో సమీపంలో దొరికిన రాయితీసుకుని ఆమె తలపై కొట్టాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై నిందితుడు అత్యాచారం చేసి, అనంతరం చంపేశాడు. ఇంటి నుంచి వెళ్లిన తన బంధువు తిరిగి చేరక పోవడంతో మరునాడు మృతురాలి సోదరి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన వినయనగర్‌ కాలనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌ సమీపంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలడంతో విచారణ మొదలుపెట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా శుక్రూనాయక్‌ ఆదివారం చిక్కాడు. తమదైన శైలిలో విచారించగా అతను నిజం ఒప్పేసుకోవడంతో కోర్టు ఆదేశాలతో రిమాండుకి తరలించారు. 

More Telugu News