Amit Shah: డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంకు ఖాతా వరకు.. అన్నింటికీ ఇక ఒకటే కార్డు: అమిత్ షా

  • ఒకే దేశం-ఒకే కార్డు దిశగా కేంద్రం
  • తొలిసారి పేపర్ ఉపయోగించకుండా జన గణన
  • మొబైల్ యాప్ ద్వారా కుటుంబ వివరాల నమోదు

ప్రస్తుతం దేశంలోని పౌరుల జేబులు కార్డులతో నిండిపోతున్నాయి. పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని కార్డులు. అయితే, ఇకపై ఇన్నిన్ని కార్డులు జేబులో వేసుకుని తిరిగే బాధ తప్పనుంది. ‘ఒకే దేశం-ఒకే కార్డు’ పేరుతో అన్నింటి వివరాలు ఒకే కార్డులో నిక్షిప్తం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు ఇలా అన్నింటినీ వేర్వేరుగా వెంట తీసుకెళ్లే పనిలేకుండా వాటి స్థానంలో ‘ఆల్ ఇన్ వన్’ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

భారత రిజిస్ట్రార్ జనరల్/జనగణన కమిషన్ కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన అనంతరం షా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ దిశగా చర్యలు ప్రారంభమైనదీ, లేనిదీ వెల్లడించలేదు. బహుళ ప్రయోజనకార్డు వలన చాలా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈసారి జనాభా లెక్కలను మొబైల్ యాప్‌తో నిర్వహిస్తున్నట్టు చెప్పిన షా.. తొలిసారి కలం, కాగితం అవసరం లేకుండా జనాభాను లెక్కిస్తున్నట్టు తెలిపారు. కొత్త మొబైల్ యాప్‌లో ఎవరైనా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని అమిత్ షా పేర్కొన్నారు.

More Telugu News