Visakhapatnam District: భార్య, కుమార్తెలను చంపి.. తను ఆత్మహత్య చేసుకున్న భర్త

  • మద్యానికి బానిసై భార్యను హింసించిన భర్త
  • భార్యను కత్తితో పొడిచి, ఏడాది వయసున్న కుమార్తెను గొంతు నులిమి చంపిన కిరాతకుడు
  • రైలుకింద పడి ఆత్మహత్య

భార్యను కత్తితో పొడిచి చంపి, కుమార్తెను ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసిన ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్టణం పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని  షిప్‌యార్డ్ కాలనీ బింద్రానగర్ జాహ్నవి ఎన్‌క్లేవ్‌లో నివసించే శుక్రజిత్ భంజ్‌దేవ్-సుక్లతో సమాంత్‌లు భార్యాభర్తలు. 2017లో వీరికి వివాహమైంది. 2018లో కుమార్తె హర్షిత జన్మించింది.

ఎఫ్‌సీఐలో పనిచేసే శుక్రజిత్ మద్యానికి బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేని సమాంత్ జూన్‌లో భువనేశ్వర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, కుమార్తెకు నచ్చజెప్పిన తల్లిదండ్రులు ఆమెను తిరిగి భర్త వద్దకు పంపించారు. ఈ నెల 19న కూడా భర్త ఆమెను హింసించాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అదే రోజు రాత్రి తల్లిదండ్రులు తిరిగి ఆమెకు ఫోన్ చేస్తే అది స్విచ్ఛాప్‌లో ఉంది.

కాగా, ఈ నెల 21న సమాంత్, హర్షితల హత్య విషయాన్ని శుక్రజిత్ తండ్రి ప్రతాప్‌చంద్.. సమాంత్ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భార్యను కత్తితో పొడిచి చంపిన శుక్రజిత్.. ఏడాది వయసున్న చిన్నారిని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఒడిశాలోని రాజగాంపూర్ జీఆర్‌పీ అవుట్‌పోస్టు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాంత్ సోదరుడు పురుషోత్తందాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News