T20: బెంగళూరు టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి... సిరీస్ సమం చేసిన దక్షిణాఫ్రికా

  • మూడో టి20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విక్టరీ
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • ఒక్క వికెట్ నష్టానికి లక్ష్యం ఛేదించిన దక్షిణాఫ్రికా

బెంగళూరులో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత జట్టు పరాజయం పాలైంది. అన్నిరంగాల్లో సత్తా చాటిన దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులతో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్టుయిన్ 2, హెండ్రిక్స్ 2 వికెట్లు తీశారు.

అనంతరం 135 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ డికాక్ ముందుండి నడిపించాడు. డికాక్ 52 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (28), టెంబా బవుమా (27 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. దాంతో 16.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 140 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య మాత్రమే వికెట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.

More Telugu News