Jana Sena: నాకు సెల్ఫీ పిచ్చి లేదు: రేవంత్ వ్యాఖ్యలపై సంపత్ కౌంటర్

  • పవన్ తో సెల్ఫీకి సంపత్ కు అవకాశమివ్వలేదన్న రేవంత్
  • నాతో సెల్ఫీ దిగేవారూ చాలా మంది ఉన్నారు
  • సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో ప్రజలకు తెలుసు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో సెల్ఫీ దిగేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అవకాశం ఇవ్వలేదని, ఆ కోపాన్ని తనపై చూపిస్తే ఏం లాభమంటూ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం తెలిసిందే.

దీనిపై ఈ రోజు సంపత్ కుమార్ స్పందిస్తూ, ‘నాకు సెల్ఫీ పిచ్చి లేదు. నాతో సెల్ఫీ దిగేవారు చాలా మంది ఉన్నారు’ అని బదులిచ్చారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారని విమర్శించారు. యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా పోరాటం చేస్తోందని అన్నారు. ‘జనసేన’ తరఫున కనీసం ఒక్క సర్పంచ్ కూడా లేరని, అటువంటి పార్టీ  ఈ అంశంపై  అఖిలపక్ష సమావేశం నిర్వహించడం కరెక్టు కాదని అన్నారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఎంతో క్రెడిట్ ఉందని, ఆ క్రెడిట్ అంతా వేరే పార్టీకి వెళ్లకూడదని అన్నారు. ‘యురేనియం’ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సమావేశం నిర్వహిస్తే వెళతాను కానీ, కాంగ్రెస్ పాత్ర ఏంటన్న విషయం పార్టీలో ముందుగా చర్చ జరగాలని అన్నారు.

More Telugu News