Jagan: కోడెలను ఆత్మహత్యకు పురిగొల్పారు.. అంటూ 'సాక్షి', విజయసాయిలపై కేసులు పెట్టే యోచనలో టీడీపీ!

  • కోడెలపై విజయసాయి అవమానకరంగా ట్వీట్లు
  • జగన్ మీడియా పనికట్టుకుని కథనాలు
  • ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించాయి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత మీడియా సాక్షి, వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిలపై ప్రైవేటు కేసులు పెట్టాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు పరోక్షంగా వీరు ప్రేరేపించారని ఆరోపిస్తూ కేసులు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ‌గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో చంద్రబాబు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోడెల ఆత్మహత్యకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి ప్రతిరోజూ కోడెలను అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు పెట్టడం ద్వారా ఆయనను మానసికంగా కుంగదీశారని, జగన్ మీడియా కూడా పనిగట్టుకుని మరీ ఆయనపై కథనాలు ప్రచురించి ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారని ఈ సందర్భంగా కొందరు నేతలు పేర్కొన్నారు. ఈ విషయంలో చూస్తూ ఊరుకోవడం సరికాదని, కోడెల ఆత్మహత్యకు కారణమైన వారిపై ప్రైవేటు కేసులు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో అవసరమైన న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. కోడెల ఆత్మహత్య విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

More Telugu News