vikram landar: మన ‘విక్రమ్‌’డు ఏమయ్యాడో?...నాసా ఫొటోల్లోనూ దొరకని ఆచూకీ!

  • ల్యాండర్‌ దిగిన చోట ఫొటోలు సేకరించిన నాసా
  • ఇంకా విక్రమ్‌పై స్పష్టత రాలేదని  ప్రకటన
  • నీడ భాగంలోగాని, దూరంగా గాని ఉండవచ్చునని అనుమానం

చంద్రయాన్‌-2లో భాగంగా భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో  చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన విక్రం ల్యాండర్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. చివరి నిమిషంలో ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ ఆగిపోయి ఆచూకీ లభ్యం కానీ విషయం తెలిసిందే. దీంతో విక్రమ్‌ జాడ కనుక్కునేందుకు సాయపడడానికి 'నాసా' ముందుకు వచ్చింది. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో తమ లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) నుంచి రెండు రోజుల క్రితం ఫొటోలు తీసింది. ఆ ఫొటోల్లో ఎక్కడా విక్రమ్‌ జాడ కనిపించడం లేదని, అందుకే వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని నాసా తెలిపింది.

‘ఫొటోలు తీసే సమయానికి ల్యాండర్‌ నీడలో ఉండడంగాని, నిర్దిష్ట ప్రాంతానికి ఆవలగాని ఉన్నట్టయితే ఫొటోల్లో కనిపించక పోవడం విశేషం ఏమీ కాదు, పాత ఫొటోలతో వాటిని పోల్చిచూస్తేగాని వాస్తవం తెలియదు’ అని నాసా ఎల్‌ఆర్‌ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ జాన్‌కెల్లర్‌ తెలిపారు. తమ ఆర్బిటర్‌ చంద్రుని ఉపరితలానికి అతి దగ్గర నుంచి ఫొటోలు తీయడం వల్ల నీడ ఎక్కువగా పడిందని నాసా తెలిపింది. కాగా, విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇస్రో ప్రకటించింది.

More Telugu News