Andhra Pradesh: ఇంకెంతమందిని ఇలా బలి తీసుకుంటారో?: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

  • అధికార దాహంతో ఆనాడు విష పత్రికను మొదలెట్టారు
  • ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉంది
  • గత 3 నెలలుగా కోడెలపై వైసీపీ నేతలు విషం కక్కారు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి వైసీపీనే కారణమని టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు ఆరోపణలు చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.

అధికార దాహంతో, ఆనాడు మొదలు పెట్టిన విషపత్రిక ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉందని ఆరోపించారు. శవరాజకీయంలో ఆరితేరిన జగన్, ఆలోచనలకు అనుగుణంగా, దొంగలెక్కల ‘A2’ విజయసాయిరెడ్డి సారధ్యంలో నిజాలని కప్పేసి, కోడెలపై గత 3 నెలలుగా వైసీపీ నేతలు ఎలా విషం కక్కారో చూడండి అంటూ ఆయా కథనాల వివరాల గురించి ప్రస్తావించారు.

‘ప్రజానేత కోడెల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి, మానసికంగా వేధించి, ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన వీళ్ళు మనుషులా?’ అని ప్రశ్నించారు. ఘనమైన నేరచరిత్ర వైసీపీ నేతల సొంతం అని ఆరోపించారు. ‘సొంత తండ్రి శవంతో మొదలైన ఈ పైశాచిక క్రీడ కోడెల గారి మరణందాకా వచ్చింది. ఇంకెంతమందిని ఇలా బలి తీసుకుంటారో?’ అని ఆరోపించారు.

More Telugu News