Andhra Pradesh: జనసేన ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్!

  • నా మద్దతుదారుల ఖాతాలను సస్పెండ్ చేశారు
  • ఎందుకు చేశారో తెలియడం లేదు
  • నిస్సహాయుల పక్కన నిలబడినందుకే చేశారా?

జనసేన పార్టీకి చెందిన 400 ఖాతాలను ఇటీవల ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్ పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలను కూడా బ్లాక్ చేసేసింది.

ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన మద్దతుదారులకు సంబంధించిన 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అని ట్విట్టర్ యాజమాన్యాన్ని నిలదీశారు.

దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తమ సామాజిక మాధ్యమ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేనాని ట్విట్టర్ లో స్పందించారు. జనసేన పార్టీ ఇటీవల ‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ విషయంలో కలిసి పోరాడాలని కాంగ్రెస్ పార్టీ-పవన్ కల్యాణ్ నిర్ణయించిన నేపథ్యంలో జనసేన సోషల్ మీడియా ఖాతాలపై సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం.

More Telugu News