Sunday: బోటు ప్రమాదాలన్నీ ఆదివారమే!

  • గతంలో ఆదివారమే జరిగిన రెండు ప్రమాదాలు
  • కృష్ణానది పవిత్ర సంగమం వద్ద తొలి ప్రమాదం
  • గతేడాది జులైలో దేవీపట్నం సమీపంలోనే రెండో ఘటన

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద నిన్న జరిగిన బోటు బోల్తా ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గల్లంతయ్యారు.  27మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, బోటు ప్రమాదాలన్నీ ఆదివారమే జరుగుతుండడం గమనార్హం.

గోదావరి, కృష్ణా నదులలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ ఆదివారం నాడే జరిగాయని చెబుతున్నారు. విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద 12 నవంబరు 2017న కృష్ణానదిలో భక్తులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగింది ఆదివారమే.

గతేడాది జులైలో దేవీపట్నం సమీపంలో బోటు తిరగబడి 15 మంది చనిపోయారు. ఇది కూడా ఆదివారమే జరిగింది. తాజా ప్రమాదం కూడా ఆదివారమే జరిగింది. శని, ఆదివారాలు వరసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఆనందంగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఏపీ, తెలంగాణలోని పలు కుటుంబాల్లో ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

More Telugu News